

ఎయిరిండియా కీలకమైన కొత్త దశలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందడంతో పాటు సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవాలని టాటా సన్స్ ఛైర్మన్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అన్నారు. ఎయిరిండియా ఉద్యోగులతో నిర్వహించిన టౌన్హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాంప్బెల్ విల్సన్ స్థానంలో సంస్థ కొత్త ఎండీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న టెవోల్డే గెబ్రెమరియంను ఉద్యోగులకు పరిచయం చేశారు. ఎయిరిండియాకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఉద్యోగులంతా కలిసికట్టుగా పనిచేయాలని టెవోల్డే పిలుపునిచ్చారు. ‘‘మేం ఎయిరిండియాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విమానయాన రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టెవోల్డే గెబ్రెమరియం.. 11 ఏళ్లకు పైగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్లో పనిచేశారు. ఎయిరిండియాకు గొప్ప చరిత్ర, బలమైన బ్రాండ్, అపారమైన సామర్థ్యం ఉన్నాయని తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం ముంబయిలో పనిచేస్తున్న సమయంలో ఎయిరిండియాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో విమానయాన రంగంలో ఎయిరిండియా అగ్రస్థానంలో ఉండేదని, తిరిగి అదే స్థాయికి తీసుకురావడంలో భాగస్వామి అయ్యే అవకాశం లభించడం తనకు మంచి అవకాశమని అన్నారు. సంస్థలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యోగులు తమ ఆందోళనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా వాతావరణం కల్పించాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!