

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ పే విషయంలో కోత పడినట్లు సమాచారం. గత క్వార్టర్తో పోలిస్తే వేరియబుల్ పే సుమారు 30–35 శాతం తగ్గిందని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే అంతకుముందు దాదాపు రెండేళ్లపాటు ఈ స్థాయి ఉద్యోగులకు కేవలం 20–40 శాతం మాత్రమే వేరియబుల్ పే లభించిన నేపథ్యంలో తాజా చెల్లింపు కొంత మెరుగైనదేనని తెలుస్తోంది. అయినప్పటికీ గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో 100 శాతం వేరియబుల్ పే అందడం లేదని పలువురు సీనియర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీసీఎస్ వర్క్ఫోర్స్లో ఎక్కువగా ఉండే జూనియర్ బ్యాండ్ ఉద్యోగులకు మాత్రం 100 శాతం క్వార్టర్లీ బోనస్ కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో టీసీఎస్ వేరియబుల్ పేను ఉద్యోగుల పనితీరుతో పాటు ఆఫీస్ హాజరుతోనూ అనుసంధానించింది. సంస్థ అమలు చేస్తున్న ఐదు రోజుల వర్క్ఫ్రమ్ఆఫీస్ విధానంలో పూర్తి వేరియబుల్ పే పొందాలంటే కనీసం 85 శాతం హాజరు తప్పనిసరి. 75–85 శాతం హాజరు ఉంటే 75 శాతం, 60–75 శాతం ఉంటే 50 శాతం వేరియబుల్ పే మాత్రమే లభిస్తుంది. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే వేరియబుల్ పే పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు వార్షిక వేతన పెంపులను ప్రారంభించడంతో జూన్ క్వార్టర్లో టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్ 24 శాతానికి పడిపోయిందని సీఎఫ్వో సమీర్ సేక్సారియా తెలిపారు. వార్షిక ఇంక్రిమెంట్ల కారణంగా మార్జిన్లపై 170 బేసిస్ పాయింట్ల ప్రభావం పడిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత సామర్థ్యాలను పెంచుకోవడానికే ఈ పెట్టుబడులు చేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ కూడా ఈ క్వార్టర్లో వేరియబుల్ పేను 70 శాతానికి తగ్గించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!