

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న జానపద థ్రిల్లర్ ‘వ్వన్-ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’పై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. అరుణాభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తొలుత మే 15న విడుదల కావాల్సి ఉండగా, సెప్టెంబర్ 25కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ తేదీకి కూడా సినిమా విడుదల కావడం లేదని సమాచారం.
సినిమా నిర్మాణానికి సంబంధించి తెరవెనుక సృజనాత్మక విభేదాలు తలెత్తినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సినిమాను భారీ స్థాయిలో రీ-షూట్, రీ-ఎడిట్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ బృందాన్ని తొలగించడంతో పాటు, ప్రాజెక్ట్కు సంబంధించిన అసలు సృష్టికర్తలైన టీవీఎఫ్, దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా కూడా తప్పుకున్నట్లు సమాచారం. అనంతరం మిగిలిన నిర్మాణ, ఎడిటింగ్ పనులను నీరజ్ కొఠారి, సాహిర్ రజా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను పూర్తి చేసేందుకు సిద్ధార్థ్ మల్హోత్రా మరో 17 రోజుల పాటు రీ-షూట్లో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 25న కూడా ‘వ్వన్’ విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!