

‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు గిరీశ్ ఏడీ.. నివిన్ పౌలి, మమిత బైజు జంటగా తెరకెక్కించిన చిత్రం ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. ఆష్లే, జస్టిన్ పాత్రల చుట్టూ సాగే ఈ ప్రేమకథలో వయసు వ్యత్యాసం ప్రధాన అంశంగా నిలుస్తుంది. సాధారణమైన కథను సహజమైన పాత్రలు, ఆహ్లాదకరమైన ప్రేమ సన్నివేశాలు, చక్కటి హాస్యంతో దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా ఆష్లే, జస్టిన్ మధ్య పరిచయం, సంగీతం–పాత ఆడియో క్యాసెట్ల ద్వారా వారి బంధం బలపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఇక ద్వితీయార్ధంలో ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో కథలో సంఘర్షణ పెరుగుతుంది. హీరో తమ్ముడి ప్రేమకథ, అతడి చుట్టూ జరిగే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, భావోద్వేగంతో కూడిన ముగింపు సినిమాకు బలంగా నిలుస్తుంది. జస్టిన్గా నివిన్ పౌలి సహజమైన నటనతో ఆకట్టుకోగా, ఆష్లేగా మమిత బైజు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటనతో మెప్పించారు. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. విష్ణు విజయ్ సంగీతం, అజ్మల్ సాబు ఛాయాగ్రహణం కూడా సినిమాకు అదనపు బలం. మొత్తంగా ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ హాయిగా నవ్విస్తూ, భావోద్వేగాలను పంచే ఫీల్ గుడ్ ప్రేమకథ.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!