

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల ఎంపికలో దాదాపు ఒకే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రయోగాత్మక కథల కంటే తమ మాస్ ఇమేజ్కు తగ్గ కథలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో విజయాలు అందించిన దర్శకులతో మరోసారి పనిచేయడానికి ఇద్దరూ ఆసక్తి చూపుతున్నారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో మంచి విజయాన్ని అందించిన బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా ‘వీర సింహా రెడ్డి’తో సక్సెస్ అందించిన గోపీచంద్ మలినేనితో మరో ప్రాజెక్ట్లో భాగమవుతున్నారు.
దర్శకుల ఎంపికలోనే కాకుండా కథల విషయంలోనూ చిరంజీవి, బాలకృష్ణ ప్రయాణం ఒకే దిశలో సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్, మాఫియా నేపథ్యాలతో కూడిన మాస్ కథలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్, అభిమానులను ఆకట్టుకునే మాస్ ఎలివేషన్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయవంతమైన దర్శకులతో మళ్లీ పనిచేయడం ద్వారా ప్రేక్షకుల అంచనాలను అందుకోవచ్చనే నమ్మకం ఈ వ్యూహం వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడంతో.. ఈ సక్సెస్ ఫార్ములా ఇద్దరు హీరోలకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో ఆసక్తికరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!