

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై సికింద్రాబాద్లోని గాయత్రి గార్డెన్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయాలని తాము కోరడం లేదని, గోదావరిలో వృథాగా కిందకు వెళ్లిపోతున్న నీటిని ఎత్తిపోసి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలు, ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలను రాజకీయాలకు బలి చేయొద్దని సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాంకేతిక నిపుణుల సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
తాను తెలంగాణ మట్టిబిడ్డనని, ప్రజా ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజల కోసం మాట్లాడుతున్నందుకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గబోనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల డబ్బును తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నీటి నిర్వహణపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!