

హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. "బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పడం అర్థరహితం" అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు దాదాపు 30 శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్నినో ప్రభావం కనిపిస్తోందని, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా దీని ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.
రైతులు మెట్ట పంటల సాగుతో పాటు ఆయిల్ పామ్ సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని మంత్రి తెలిపారు. గాంధీ భవన్ను ప్రజలు నమ్మకానికి ప్రతీకగా భావించి తమ సమస్యలను తెలియజేయడానికి వస్తున్నారని చెప్పారు. అక్కడ స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమం ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రజలకు నేరుగా చేరువవుతోందని, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో పాల్గొంటున్నారని అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!