

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీ నాయకత్వం, ‘కోటరీ’పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనను ‘నమ్మకద్రోహి’గా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం సుదీర్ఘ బహిరంగ లేఖ విడుదల చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే తాను రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నానని తెలిపారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డికి తాను ఎప్పుడూ నమ్మకస్తుడిగానే ఉన్నానని పేర్కొంటూ, తాను నమ్మకద్రోహి అయితే గతంలోనే కాంగ్రెస్తో రాజీ చేసుకుని సీబీఐ, ఈడీ కేసుల నుంచి బయటపడేవాడినని వ్యాఖ్యానించారు. జగన్తో కలిసి తాను కూడా 15 నెలలు జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తుచేశారు.
వైసీపీలో ప్రస్తుతం జగన్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక స్థాయిలో ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సజ్జల రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు జగన్ను కలిసే అవకాశం లేకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. 2022 మంగళగిరి ప్లీనరీలో తనపై భౌతిక దాడికి ప్రయత్నించినా జగన్ స్పందించలేదని ఆరోపించారు. కోటరీ ఒత్తిళ్ల కారణంగా తనను కీలక బాధ్యతలు, కోర్ కమిటీ నుంచి తప్పించారని, తనను అవమానించిన ఘటనలు 74 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీలో కొనసాగుతూ కోవర్టు రాజకీయాలు చేయడం తన వల్ల కాదని, ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతానని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు అసలైన ద్రోహులు ఎవరో ఆలోచించుకోవాలని కోరుతూ, త్వరలో మరిన్ని అంశాలను మీడియా ముందు వెల్లడిస్తానని తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!