

సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రైవేటు వైద్యం ఖరీదైన నేపథ్యంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కోసం రూ.2,700 కోట్లు, సీఎం సహాయనిధి కోసం రూ.2,526 కోట్లు ఖర్చు చేశామని, మొత్తంగా పేదల ఆరోగ్యం కోసం రూ.5,226 కోట్లు వెచ్చించామని చెప్పారు. రెండేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖ కోసం రూ.21,800 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఉస్మానియా, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలో అదనంగా సుమారు 10 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రతి ఆసుపత్రికి ప్రత్యేక డైరెక్టర్ను నియమించి కార్పొరేట్ తరహాలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్పై విమర్శలు చేసిన సీఎం.. వారు అధికారంలో ఉన్న పదేళ్లలో ఆసుపత్రులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. “మీరు ఫామ్హౌస్లు నిర్మించుకోవడంలో ఆలస్యం చేయలేదు.. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రులను పూర్తి చేయడంపై ఎందుకు శ్రద్ధ చూపలేదు?” అని నిలదీశారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రజలు వాస్తవాలను గమనిస్తారని, అబద్ధాలు చెప్పడం ఆపనంత కాలం తాను వాస్తవాలను చెబుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!