

భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఆరంభంలో కొన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నా.. అనుభవంతో తన సత్తా చాటుతాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నారు. ప్రతి కెప్టెన్ విజయంతోనే కెరీర్ను ప్రారంభించడని, కాలక్రమేణా అనుభవంతో మెరుగుపడతారని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు శ్రేయస్ అయ్యర్ నాయకత్వానికి కీలక పరీక్షగా మారనున్నాయని, ఈ టోర్నీలో అతను తన ముద్ర వేయాలని కోరుకుంటాడని గావస్కర్ అభిప్రాయపడ్డారు. భారత జట్టుకు స్వర్ణం సాధించే సత్తా ఉందని, అదృష్టం కూడా కలిసొస్తే టైటిల్ గెలిచే అవకాశం ఉందని అన్నారు. శుభ్మన్ గిల్ను టీ20 జట్టులోకి తీసుకోవాలా వద్దా అనేది సెలక్షన్ కమిటీ నిర్ణయమని, ప్రస్తుతం ఎంపికైన జట్టుకు అందరూ మద్దతు ఇవ్వాలని సూచించారు.
ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీ అంత సులభంగా ఉండదని గావస్కర్ పేర్కొన్నారు. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి జట్లతో పాటు నేపాల్ను కూడా తక్కువగా అంచనా వేయకూడదన్నారు. టీ20 ఫార్మాట్లో రెండు బంతులతోనే మ్యాచ్ పరిస్థితి మారిపోవచ్చని గుర్తుచేశారు. ఇతర క్రీడాకారులతో కలిసి క్రికెటర్లు ఉండటం మంచి అనుభవమని, వారి ప్రయాణాలు, అనుభవాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. బాక్సింగ్, రెజ్లింగ్తో పాటు అథ్లెటిక్స్లోని రిలే జట్ల ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!