

ఆసియా క్రీడల్లో భారత్కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) పురుషుల 77 కిలోల విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించాల్సిన వరుణ్ సన్యాల్ పోటీకి దూరమయ్యాడు. బరువు తగ్గించే ప్రక్రియలో భాగంగా సౌనా తీసుకుంటుండగా ఆయనకు కళ్లు తిరగడం, కండరాల నొప్పులు రావడంతో స్పృహ కోల్పోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వెంటనే వైద్య సహాయం అందించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, వైద్యులు పోటీలో పాల్గొనేందుకు అనర్హుడిగా ప్రకటించారు. బరువు తగ్గించే ప్రయత్నంలో ఆహారం, నీటి తీసుకునే పరిమాణాన్ని తగ్గించినట్లు కూడా నివేదికలు తెలిపాయి. దీంతో 77 కిలోల విభాగంలో జరగాల్సిన క్వార్టర్ఫైనల్కు వరుణ్ అందుబాటులో లేకుండా పోయాడు.
భారత్ నుంచి ఆసియా క్రీడల ఎంఎంఏ జట్టులో ఎంపికైన ఇద్దరు క్రీడాకారుల్లో వరుణ్ సన్యాల్ ఒకరు. 2026 జనవరిలో చైనాలో జరిగిన ఆసియా ఎంఎంఏ ఛాంపియన్షిప్లో ఆయన కాంస్య పతకం సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో ఆయనపై అంచనాలు నెలకొన్నాయి. అయితే పోటీకి ముందు ఎదురైన అనారోగ్య పరిస్థితులతో ఆయన టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆసియా క్రీడల్లో ఎంఎంఏ తొలిసారి పతక క్రీడగా చోటు దక్కించుకున్న నేపథ్యంలో వరుణ్ నుంచి భారత్ పతకాన్ని ఆశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!