

కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణను వినియోగిస్తూ పన్నుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పన్నుల నిర్వహణ విధానాన్ని అధ్యయనం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డి.పి. మిశ్రాలతో కూడిన బృందం విజయవాడలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లు, రిటర్నులు, ఆదాయం, వృత్తిపన్ను, పన్ను బకాయిలు, ఆడిట్లు, తనిఖీలు, పరిశీలనకు సంబంధించిన ఏఐ ఆధారిత డ్యాష్బోర్డులను అధికారులు ప్రదర్శించారు. ముఖ్యంగా రాబడి, ఈ-వే బిల్ డ్యాష్బోర్డులు జీఎస్టీ కౌన్సిల్ బృందాన్ని ఆకట్టుకున్నాయి.
ఈ-వే బిల్ డేటా ఆధారంగా ఎస్జీఎస్టీ నగదు చెల్లింపులు, ఐజీఎస్టీ సెటిల్మెంట్లను అంచనా వేయడంతో పాటు ఆదాయ పర్యవేక్షణకు అవసరమైన సమాచారాన్ని పొందుతున్న విధానాన్ని అధికారులు వివరించారు. ఏఐ ఆధారిత నివేదికలు, డ్యాష్బోర్డుల తయారీ, వివిధ రంగాలకు సంబంధించిన సమాచారంతో ఏర్పాటు చేసిన నాలెడ్జ్ హబ్ను కూడా ప్రదర్శించారు. రిటర్నుల పరిశీలన, ఆడిట్ ఎంపిక, అవకతవకల గుర్తింపు, నోటీసుల జారీ, పన్ను చెల్లింపుదారుల స్పందనల పరిశీలన వంటి ప్రక్రియల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అనుసంధానమైన లీగల్ ఏఐ మాడ్యూల్ను కూడా బృందం పరిశీలించింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ సాంకేతిక చర్యలను పంకజ్ కుమార్ సింగ్ అభినందిస్తూ, ఇతర రాష్ట్రాలకు ఈ విధానం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!