

కృత్రిమ మేధ (ఏఐ) పూర్తిగా తటస్థంగా పనిచేస్తుందనే భావనను ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదిక ప్రశ్నించింది. చాట్జీపీటీ, జెమినై వంటి ఏఐ టూల్స్కు ఆధారమైన భాషా నమూనాలు మహిళలను ప్రధానంగా ఇల్లు, కుటుంబం, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలతో అనుసంధానిస్తుండగా, పురుషులను వ్యాపారం, నాయకత్వం, వృత్తిపరమైన పాత్రలతో ఎక్కువగా ముడిపెడుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ విధంగా ఏఐ ఇప్పటికే ఉన్న సామాజిక మూస ధోరణులను సవాలు చేయకుండా మరింత బలపరుస్తోందని పేర్కొంది.
ఉద్యోగ నియామకాలు, బయోడేటా స్క్రీనింగ్ వంటి రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ లింగ వివక్ష మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. నాయకత్వ లక్షణాలను పురుషులతో, సంరక్షణ బాధ్యతలను మహిళలతో అనుసంధానించడం వల్ల నియామక ప్రక్రియలో మహిళలు వెనుకబడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే డీప్ఫేక్ సాంకేతికత దుర్వినియోగంలో మహిళలే ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారని పేర్కొంటూ, నైతిక ప్రమాణాలు, బలమైన భద్రతా చర్యలు మరియు నిరంతర పర్యవేక్షణతో ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఐరాస నొక్కి చెప్పింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!