

పిల్లల ఉన్నత విద్య, భవిష్యత్ అవసరాల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒక దీర్ఘకాలిక పొదుపు సాధనంగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరిట పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. తల్లి లేదా తండ్రిలో ఒకరు మాత్రమే గార్డియన్గా ఉండాలి. తపాలా కార్యాలయాలు లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా ఖాతాను ప్రారంభించవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్లో జమ చేయవచ్చు. తల్లిదండ్రుల సొంత పీపీఎఫ్ ఖాతా, మైనర్ పిల్లల ఖాతాలో చేసే పెట్టుబడులు కలిపి వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు మించకూడదు. ఖాతా కాలపరిమితి 15 సంవత్సరాలు. మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణ సదుపాయం, ఏడో సంవత్సరం నుంచి నిబంధనల ప్రకారం పాక్షిక ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది. మెచ్యూరిటీ అనంతరం ఐదేళ్ల చొప్పున గడువును పొడిగించుకోవచ్చు.
ప్రస్తుతం పీపీఎఫ్పై వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. వడ్డీని నెలలో 5వ తేదీ నుంచి చివరి తేదీ వరకు ఉన్న కనిష్ఠ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కించి, ప్రతి ఏడాది మార్చి 31న ఖాతాలో జమ చేస్తారు. పీపీఎఫ్కు ఆదాయపు పన్ను చట్టం కింద ఈఈఈ ప్రయోజనం ఉంది. నిబంధనలకు లోబడి పెట్టుబడులు సెక్షన్ 80C కింద మినహాయింపు పొందడంతో పాటు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!