

దేశంలో ఔషధాల భద్రత, నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, సూక్ష్మజీవ నిరోధక మందులు, క్యాన్సర్ చికిత్స మందులు, మత్తు పదార్థాలకు సంబంధించిన ఔషధాలపై క్యూఆర్ కోడ్ లేదా గీతల సంకేతాన్ని తప్పనిసరి చేస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిబంధనల్లో సవరణలు చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం మందుల ప్యాకెట్లపై ఔషధం పేరు, బ్రాండ్ పేరు, తయారీ సంస్థ వివరాలు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీ అనుమతి సంఖ్య వంటి వివరాలు క్యూఆర్ కోడ్లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు, అధికారులు ఈ సంకేతాన్ని స్కాన్ చేసి మందు అసలుదా కాదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
ఇప్పటి వరకు ఈ విధానం దేశంలోని 300 ప్రముఖ ఔషధ బ్రాండ్లకు మాత్రమే వర్తించేది. తాజా నిర్ణయంతో కీలక ఔషధ విభాగాలన్నింటికీ దీనిని విస్తరించారు. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, మత్తు పదార్థాలకు సంబంధించిన మందులపై ఈ నిబంధన 2027 జూలై 1 నుంచి అమల్లోకి రానుండగా, సూక్ష్మజీవ నిరోధక మందులపై 2028 జూలై 1 నుంచి అమలు కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!