

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, నృసింహసాగర్ రిజర్వాయర్లను నింపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వానాకాలంలో తక్కువ వర్షపాతం, రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున, మిడ్ మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసి అనుసంధాన రిజర్వాయర్లు, చెరువులు, చెక్డ్యామ్లను నింపాలని కోరారు. అలాగే 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు డ్యామ్లో ప్రస్తుతం 6.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, మిడ్ మానేరు నుంచి నీటిని తరలించి ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!