

తాండూర్లో జరిగిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రమేశ్ను నియమించడాన్ని ప్రస్తావిస్తూ, ఆయన నాయకత్వంలో పార్టీని మరింత సమన్వయంతో బలోపేతం చేయాలని కోరారు. గతంలో టైగర్ నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతంలో పార్టీ సాధించిన మెజారిటీని గుర్తుచేసిన ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను బీజేపీ ఆవిర్భావ సమయంలోనే పార్టీ జెండాను మోశానని గుర్తుచేస్తూ, తాండూర్లో పార్టీకి బలమైన చరిత్ర ఉందన్నారు.
తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రెండు పార్టీల పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, భవన నిర్మాణాల్లో కమిషన్ల వ్యవహారం కొనసాగుతోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అవినీతి ఆరోపణలు లేవని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పేదలకు ఉచిత బియ్యం, రైతులకు సబ్సిడీలు వంటి చర్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలను చూసిన ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరిన ఆయన, కార్యకర్తలు ఐక్యంగా ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!