

మణిపూర్లో ప్రతిపాదిత జనగణన ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షా, ఇతర కేంద్ర నాయకులకు మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల డిమాండ్ల పరిష్కారానికి మద్దతు అందించిన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, సీఎం ఖేమ్చంద్ సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జనగణనకు ముందే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ప్రక్రియను పూర్తి చేయాలని మణిపూర్లో కొంతకాలంగా డిమాండ్లు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్ఆర్సీ లేకుండా జనగణన నిర్వహించడాన్ని మైతేయి, నాగా వర్గాలు వ్యతిరేకించగా.. కుకీ-జో కౌన్సిల్ మాత్రం భిన్నమైన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. న్యూఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు కోసం ప్రచారం నిర్వహించిన 14 సివిల్ సొసైటీ సంస్థల ప్రతినిధులు, బీజేపీ ఎమ్మెల్యేల బృందం చేసిన కృషిని సీఎం అభినందించారు. కేంద్ర నాయకులు, అధికారులతో వారు జరిపిన సంప్రదింపుల ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని పేర్కొన్నారు. 2023 నుంచి మణిపూర్లో కొనసాగుతున్న మైతేయి-కుకీ జాతి ఘర్షణల కారణంగా 50,000 మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారని, 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అందుబాటులో ఉన్న సమాచారం పేర్కొంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!