

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బోటుతో సముద్రంలోకి వెళ్లి గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు ఓడలరేవు జెట్టి నుంచి చేపల వేటకు బయలుదేరిన బోటుతో ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అనంతరం ఎలాంటి సమాచారం అందలేదు. ఆగస్టు 12 నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ రాకపోవడంతో ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బోటులో వీఎచ్ఎఫ్ సెట్తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు తెలిపారు.
గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోస్ట్గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి సముద్రంలో గాలింపు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి సమాచారం సేకరిస్తున్నారు. బాధిత కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం సూచించారు. కోస్ట్గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్ని మార్గాలను వినియోగించి మత్స్యకారుల సురక్షిత ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!