

అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీకి తెలంగాణ సీఎం ఎ. రేవంత్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా మెస్సీతో కలిసి ఫుట్బాల్ మైదానంలో కొన్ని నిమిషాలు గడపడం తనకు గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. యావత్ ఫుట్బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన GOAT మెస్సీ ప్రయాణం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. 2005లో అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించిన మెస్సీ.. అసాధారణ ప్రతిభ, నిరంతర శ్రమ, అచంచలమైన పట్టుదలతో ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు, అరుదైన రికార్డులతో ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారని తెలిపారు.
మైదానంలోనే కాకుండా సమాజ సేవలోనూ మెస్సీ ప్రత్యేకత చాటుకున్నారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. యునిసెఫ్తో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, లియో మెస్సీ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చి తెలంగాణ క్రీడాభిమానులను ప్రోత్సహించిన తీరు చిరస్మరణీయమన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ యువతను తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రయత్నాలకు మెస్సీ పర్యటన మరింత స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. క్రీడాస్ఫూర్తి, పట్టుదల, ఏకాగ్రత, నిరంతర సాధన, వినయం, అంకితభావానికి మెస్సీ ప్రతిరూపమని పేర్కొన్నారు. ఫుట్బాల్ ఉన్నంతకాలం మెస్సీ పేరు, ఆయన ముద్ర, స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా మెస్సీకి మరోసారి అభినందనలు తెలిపిన సీఎం.. ఇకపై సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!