

పేదలకు ఉచిత వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ రాయితీలతో భూమి పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు తమ సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోలేవని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తూ, జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన రొమ్ము క్యాన్సర్ బాధితురాలు బాలె భాగ్యమ్మకు 25 శాతం ఉచిత ఇన్పేషెంట్ కోటా కింద వెంటనే చికిత్స ప్రారంభించాలని ఆదేశించింది. చికిత్సలో ఆలస్యం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది.
వివరాల ప్రకారం, బాలె భాగ్యమ్మ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిని ఆశ్రయించగా, ఆమెకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని, ఖర్చులను తానే భరించాలంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆర్థికంగా చికిత్స భరించే స్థితిలో లేని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ ట్రస్ట్ ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన సామాజిక బాధ్యత ఉందని స్పష్టం చేసింది. సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని రాయితీపై పొందిన ఈ ఆసుపత్రి వెంటనే పిటిషనర్ను చేర్చుకుని శస్త్రచికిత్స, రేడియేషన్, కెమోథెరపీ వంటి అన్ని వైద్య సేవలు అందించాలని ఆదేశించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!