

అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకే సభను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. విపక్షం సభను సజావుగా సాగనివ్వకుండా కుట్ర చేసిందని, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులపై అనుచితంగా వ్యవహరించిందని ఆరోపించారు. స్పీకర్ను అత్యంత అభ్యంతరకరంగా దూషించారని పేర్కొన్నారు.
ప్రతిపక్ష కుట్రను తిప్పికొట్టి ప్రభుత్వంపై జరిగిన ప్రచారాన్ని ప్రజలకు వివరించిన పార్టీ సభ్యులను రేవంత్రెడ్డి అభినందించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు తప్పనిసరిగా చర్చల్లో పాల్గొనాలని, హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించాలని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనను దేశానికి ఆదర్శంగా నిలిచే కార్యక్రమంగా పేర్కొన్న సీఎం, అదే నమూనాలో జనగణనలో కులగణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రతి ఎమ్మెల్యే ఓటు హక్కు పరిరక్షణను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించిన పార్టీ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!