

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల కౌంట్డౌన్ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు, యోగా గురువులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం-మనసు-ఆత్మల సమన్వయానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని అన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, సానుకూల శక్తిని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని గవర్నర్ కొనియాడారు. భారతీయుల ప్రాచీన వారసత్వమైన యోగా నేడు ప్రపంచానికి ఆరోగ్యం, మానసిక సమతుల్యత సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.
తన ప్రసంగంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజంతోనే ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొంటూ, "యోగతో ఆరోగ్యం, యోగతో సమతుల్యత, యోగతో ఆత్మబలం" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!