

రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో నిర్మాణాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జిల్లాల తలసరి ఆదాయం పెరిగేలా కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. విశాఖలో అనుకూల వాతావరణం, ఈవెంట్ల పెరుగుదలతో జీఎస్డీపీ వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. బాపట్లలో సూర్యలంక బీచ్ను మరింత అభివృద్ధి చేస్తే జిల్లాకు భారీగా ఆదాయం సమకూరుతుందని, గోవాను మించి సూర్యలంకను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆదాయ అవకాశాలను గుర్తించి వినియోగించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
వాడపల్లి ఆలయం ఆదాయ వృద్ధికి మంచి ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఏడాదికి రూ.50 కోట్ల ఆదాయం వస్తోందని, మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే రూ.100 కోట్ల వరకు పెంచవచ్చని అన్నారు. స్థానిక జాతరలు, ఉత్సవాలను ప్రోత్సహించి.. ఒక కార్యక్రమానికి వచ్చిన వారు రెండు, మూడు రోజులు అక్కడే ఉండేలా వసతులు, కార్యక్రమాలు కల్పించాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారి నియమించాలని, మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖలో కృత్రిమ మేధను వినియోగించి రియల్టైంలో ఆదాయాన్ని అంచనా వేసే విధానంపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. తొలి త్రైమాసికంలో విశాఖ 38.49 శాతం, బాపట్ల 37.20 శాతం, ప్రకాశం 34.09 శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు వివరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!