

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంతో పాటు వన్యప్రాణులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. జంతువుల ఆవాస ప్రాంతాలు, సందర్శకుల మార్గాలు, ఉద్యానవనాలు, నీటి వనరులు, విశ్రాంతి ప్రాంతాలు, ఆహార పంపిణీ కేంద్రాలు, వ్యర్థాల సేకరణ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు.
జూ పరిసరాల్లో వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పచ్చదనం సంరక్షణ, పారిశుధ్య ప్రమాణాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. విశాఖ జూలో అధునాతన ఇంక్యూబేషన్ పద్ధతిలో ఇటీవల 128 కొత్త జీవాలు జన్మించిన నేపథ్యంలో జీవ వైవిధ్య పరిరక్షణకు మద్దతుగా తిరుపతి, విశాఖ జూలలో జంతువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!