

మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించిన ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్పై ప్రశంసలు కురిపించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన ఈ ఎనిమిది ఎపిసోడ్ల మ్యూజికల్ డ్రామా ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కర్ణాటక సంగీతం, కుటుంబ భావోద్వేగాలు, బాధ్యతలు, ప్రేమకథను మేళవించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సిరీస్ను వీక్షించిన చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హృదయాన్ని హత్తుకునే సంగీతాన్ని ప్రశంసించారు. నిర్మాతగా సుష్మిత సరికొత్త సిరీస్ను తీసుకురావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.
తండ్రి ప్రశంసలపై సుష్మిత కొణిదెల భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి ట్వీట్ను రీట్వీట్ చేస్తూ తనకు అందిస్తున్న ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ‘కుమారి 21F’, ‘18 పేజెస్’ చిత్రాల దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్ను రాజమండ్రి నేపథ్యంగా తెరకెక్కించారు. సంప్రదాయ సంగీతం, ఆధునిక పాప్ మ్యూజిక్ మధ్య సాగే కథలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల కీలక పాత్రలు పోషించగా, అక్షయ్ లగుసాని, సుష్మితా శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిరీస్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!