

మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా అపారమైన ఆసక్తి నెలకొంది. చిత్రీకరణ దశలోనే ఈ ప్రాజెక్ట్ గురించి వెలువడుతున్న ప్రతి సమాచారం వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమాచారం. అందుకే ఈ సినిమాకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలపై కూడా పరిశ్రమలో ప్రత్యేక దృష్టి నెలకొంది.
తాజాగా డిజిటల్, శాటిలైట్ హక్కుల అంశం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇంకా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ ప్రముఖ ఓటీటీ సంస్థలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో శాటిలైట్ హక్కుల కోసం కూడా తీవ్ర పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు. పలు భారతీయ భాషల విడుదల హక్కులకే భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. జీ5, జియో హాట్స్టార్ వంటి ప్రముఖ సంస్థల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సినిమా విడుదలకు ముందే వ్యాపార పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!