

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 8న దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇటీవల విడుదలైన ప్రచార చిత్రంలోని దృశ్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. చిత్రంలోని గ్రాఫిక్స్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించారని పలువురు వ్యాఖ్యానించడంతో ఈ అంశంపై రణబీర్ కపూర్ స్పందించారు.
కంప్యూటర్ సృష్టిత దృశ్యాలపై కనీస అవగాహన లేకుండానే చాలామంది ప్రస్తుతం విమర్శకులుగా మారిపోతున్నారని రణబీర్ అన్నారు. ఒక వీడియో చూడగానే అందులోని గ్రాఫిక్స్ బాగోలేవని సులభంగా వ్యాఖ్యానించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరగడంతో ప్రజల్లో ఈ సాంకేతికతపై ఆసక్తి పెరగడం మంచిదేనని, అయితే సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కష్టపడి రూపొందించిన పనిని కేవలం కృత్రిమ మేధస్సుతో చేసినదిగా కొట్టిపారేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులందరినీ సంతృప్తిపరచడం చాలా పెద్ద సవాలు అని తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలోనే తొలి భాగం విడుదలకు ముందే రెండో భాగానికి సంబంధించిన దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేయడం ఇదే తొలిసారి కావచ్చని రణబీర్ పేర్కొన్నారు. ‘రామాయణ’కు రెండో భాగం కూడా తెరకెక్కుతోంది. దీనిని వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!