

ఎంఐఎం పార్టీకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ సమాజాన్ని విస్మరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని కుర్మగూడ మూడు గుడుల ఆలయం, మాదన్నపేట నల్లపోచమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాల నిర్వహణకు ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించిందని, అదే సమయంలో హిందువుల పండగ బోనాలకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. బోనాల సందర్భంగా పాతనగరంలోని బస్తీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల వంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడం అన్యాయమని అన్నారు.
హిందూ పండగల నిర్వహణకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే మతచిచ్చు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని, అయితే హిందువులకు అన్యాయం జరుగుతోందని భావించిన ప్రతిసారీ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. బోనాల వేడుకల సందర్భంగా పాతనగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్జీ, మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!