

ప్రభుత్వాలు మారినా గతంలో అమలు చేసిన ప్రజాప్రయోజనకరమైన సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలతో పాటు సిరిసిల్లలో ఆయన బుధవారం పర్యటించారు. వీర్నపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పేరుతో ఉన్నాయనే కారణంతో ‘కంటి వెలుగు’, ‘కేసీఆర్ కిట్’ వంటి పథకాలను పక్కనపెట్టడం బాధాకరమని విమర్శించారు. సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
సిరిసిల్లలో ఇటీవల మృతిచెందిన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడి కుమార్తె పేరిట రూ.3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ను అందించారు. ఈ సందర్భంగా వెంకటేశం మృతిని హత్యగా పేర్కొంటూ, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనలో అరెస్టయిన వారు కేవలం పాత్రధారులేనని, దీని వెనుక పెద్ద నాయకుల హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!