

రాబోయే పురుషుల హాకీ ప్రపంచకప్ నేపథ్యంలో భారత పురుషుల, మహిళల జాతీయ జట్ల జెర్సీలను నీలం రంగు నుంచి కాషాయ రంగులోకి మార్చిన నిర్ణయంపై వచ్చిన విమర్శలకు హాకీ ఇండియా వివరణ ఇచ్చింది. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, పూర్తిగా సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టం చేసింది. అంతర్జాతీయ హాకీలో ప్రామాణికంగా ఉపయోగించే బ్లూ సింథటిక్ మైదానంపై నీలం జెర్సీ స్పష్టంగా కనిపించకపోవడంతో ఆటగాళ్లు, కోచ్లు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ రంగులను పరిశీలించినట్లు తెలిపింది. పసుపు, కాషాయం వంటి రంగులపై చర్చించిన అనంతరం కాషాయ రంగునే తుది ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
హాకీ ఇండియా ప్రకారం కాషాయ రంగు భారత జాతీయ పతాకంలోని ఒక రంగు మాత్రమే కాకుండా ధైర్యం, త్యాగం, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే జెర్సీ రంగులు మార్చడం కొత్త విషయం కాదని, 2014 ప్రపంచకప్లో పసుపు, 2018 ప్రపంచకప్లో స్కై బ్లూ జెర్సీలతో భారత జట్టు ఆడిన విషయాన్ని గుర్తు చేసింది. ఆగస్టు 15 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్త ఆతిథ్యంలో జరిగే ప్రపంచకప్లో భారత్ పూల్–డిలో ఉంది. ఆగస్టు 15న వేల్స్తో, 17న ఇంగ్లాండ్తో, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. భారత జట్టు ఇప్పటివరకు 1975లో ఒక్కసారి మాత్రమే ప్రపంచకప్ను గెలుచుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!