

ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ విద్యార్థుల బ్రాంచ్ ఎంపికలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపిన విద్యార్థులు.. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ప్రత్యేక కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఏపీ ఈఏపీసెట్ తొలి దశ కౌన్సెలింగ్ పూర్తికాగా, రాష్ట్రంలోని 247 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో ఉన్న 1,51,312 సీట్లలో 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 44,073 సీట్లు మిగిలిపోయాయి.
కోర్ CSEలో 44,883 సీట్లకు గాను 31,416 సీట్లు భర్తీ కాగా, 69.99 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మరోవైపు CSE-AIMLలో 18,873 సీట్లకు 15,819 సీట్లు భర్తీ అయి 83.81 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. CSE-AI, డేటా సైన్స్లో 81.85 శాతం, ఐటీలో 79 శాతం, ప్రత్యేక AI-ML కోర్సుల్లో 75 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈలోనూ 74 శాతం సీట్లు నిండాయి. మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు AI, ML, డేటా సైన్స్ వంటి భవిష్యత్ ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!