

జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ జూన్ త్రైమాసికంలో రూ.4,085 కోట్ల ఆదాయంపై రూ.148 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఇదే త్రైమాసికంలో రూ.3,321.23 కోట్ల ఆదాయంతో రూ.137.11 కోట్ల నష్టాన్ని చవిచూసింది. వ్యూహాత్మక అవసరాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా గరిష్ఠంగా రూ.5,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు అనుమతి ఇచ్చింది. పాత బాండ్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన కొత్త ఎన్సీడీల జారీకి కూడా ఆమోదం లభించింది.
దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ప్రారంభించిన డ్యూటీ-ఫ్రీ వ్యాపారాలు విమానయేతర ఆదాయ వృద్ధికి దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది. జీఎంఆర్ లాజిస్టిక్స్ పార్కులో 70 శాతం ఈక్విటీ వాటాను జీహెచ్ఐఏఎల్ కొనుగోలు చేయడంతో అది పూర్తి అనుబంధ సంస్థగా మారింది. దిల్లీ ఎయిర్పోర్ట్లోని సెలెబీ గ్రూపు కార్గో టెర్మినల్ లైసెన్సును జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ దక్కించుకుని కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో విమానాశ్రయ సేవలను విస్తరించి, ఆదాయ మార్గాలను మరింత బలోపేతం చేస్తామని సంస్థ ఎండీ, సీఈఓ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 71 లక్షల మంది ప్రయాణించగా, గతేడాది ఇదే కాలంలో 81 లక్షల మంది ప్రయాణించారు. పశ్చిమాసియా అనిశ్చితులు, విమాన ఛార్జీల పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ తగ్గిందని కంపెనీ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!