

ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా సజావుగా కొనసాగుతుందనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. అంతేకాకుండా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 78.23 డాలర్లకు తగ్గగా, రూపాయి విలువ 94.33 వద్ద బలపడడం మార్కెట్లకు ఊతమిచ్చింది.
గత సెషన్లో 77,155 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమై రోజంతా ఒడిదుడుకులకు లోనైంది. అయితే చివరి గంటల్లో కొనుగోళ్లు పెరగడంతో సూచీ లాభాల్లోకి వచ్చింది. చివరకు 254 పాయింట్లు పెరిగి 77,409 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించి 82 పాయింట్లు లాభపడి 24,168 వద్ద స్థిరపడింది.
లాభాలు నమోదు చేసిన షేర్లలో మ్యాక్స్ హెల్త్కేర్, నైకా, అదానీ పవర్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, కేన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎన్బీసీసీ, పేటీఎం, వరుణ్ బేవరేజెస్ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ సూచీ 378 పాయింట్లు పెరగగా, మధ్య తరహా కంపెనీల సూచీ 255 పాయింట్లు లాభపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!