

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తార్నాక డివిజన్ బీజేపీలో అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందిన యువ నాయకుడు శ్రీరామ్ వెంకటేశ్ ఇటీవల బీజేపీలో చేరగా, స్థానిక సీనియర్ నాయకులతో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. లోపాయకారీగా సాగిన ఈ వర్గపోరు ఇప్పుడు పోలీసు ఫిర్యాదులు, బహిరంగ విమర్శల వరకు చేరుకుని రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గుర్తింపు పొందిన శ్రీరామ్ వెంకటేశ్ ఎదుగుదలను కొందరు పాత నాయకులు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆయన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఫిర్యాదు ఆధారంగా మున్సిపల్ అధికారులు తొలగించడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి వంటి అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న తార్నాక డివిజన్లో ఈ పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వర్గపోరుపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!