

తెలంగాణలోని తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులను వెంటనే గుర్తించి ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులకు సంతృప్తికర స్థాయిలో పింఛన్లు అందేలా చూడాలని, దివ్యాంగులు మరణించిన వెంటనే వారి భార్యలకు ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
గ్రామీణాభివృద్ధి పనులపైనా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు సమర్థంగా పర్యవేక్షించాలని, ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని, ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి గ్రామపంచాయతీకి జనాభా ఆధారంగా కార్యాలయ భవనం నిర్మించాలని ఆదేశించారు. ఎన్నికలు జరగని పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్యం, ఇతర సేవలకు ఆటంకం కలగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!