

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) పౌరసత్వ దరఖాస్తు ఫీజులను దాదాపు 75 శాతం వరకు పెంచే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికా పౌరసత్వం పొందాలనుకునే శాశ్వత నివాసితులపై భారీ ఆర్థిక భారం పడనుంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు రాయితీలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది.
ప్రతిపాదన ప్రకారం పేపర్ ఆధారిత పౌరసత్వ దరఖాస్తు ఫీజు 760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు, ఆన్లైన్ దరఖాస్తు ఫీజు 710 డాలర్ల నుంచి 1,280 డాలర్లకు పెరగనుంది. తిరస్కరించబడిన దరఖాస్తుపై పునఃసమీక్ష కోరేందుకు చెల్లించాల్సిన ఫీజు కూడా 830 డాలర్ల నుంచి 1,475 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులకు ప్రస్తుతం ఉన్న తగ్గింపు ఫీజు సదుపాయాన్ని తొలగించాలని డీహెచ్ఎస్ సూచించింది. ఈ ప్రతిపాదనలపై 60 రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!