

రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ తన డ్రోన్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాల్లోని చమురు నిల్వ కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. యుద్ధం ముగించేందుకు రష్యా నిరాకరిస్తున్నందువల్లే ఈ దాడులను పెంచినట్లు ఆయన వెల్లడించారు. శాంతి చర్చలకు స్పందన లేకపోవడంతో రష్యాలో యుద్ధ ఒత్తిడిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, క్రిమియా సహా పలు ప్రాంతాల్లోని చమురు కేంద్రాలు, రైల్వే మౌలిక సదుపాయాలపై భారీ డ్రోన్ దాడులు జరిగాయి. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. దాదాపు ఆరు చమురు డిపోలు ధ్వంసమవడంతో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అజోవ్ సముద్రంలోని రెండు చమురు ట్యాంకర్లపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఇంధన కొరత నెలకొని, పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!