

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనూ ఆయన సినిమాలకు ప్రత్యేక ప్రేక్షక వర్గం ఏర్పడింది. ‘ఓపెన్హైమర్’ తర్వాత నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ వంటి హాలీవుడ్ నటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్కు విశేష స్పందన లభిస్తోంది. సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ల వద్ద టికెట్ల కోసం ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ చిత్రాన్ని పూర్తిగా ఐమాక్స్ 70ఎంఎం ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించడంతో ఐమాక్స్ స్క్రీన్లలో చూసేందుకు ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని పీవీఆర్ ఐకాన్ లోయర్ పరేల్లో రిక్లైనర్ సీట్ల ధరను రూ. 3,100గా నిర్ణయించగా, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పీవీఆర్ ప్రియా, సెలెక్ట్ సిటీ వాక్లలో ఈ ధర రూ. 2,500 వరకు చేరింది. సాధారణ సీట్ల ధరలు కూడా రూ. 1,000 నుంచి రూ. 2,100 మధ్య ఉండటం గమనార్హం. బెంగళూరులో టికెట్లు రూ. 1,200 నుంచి రూ. 1,950 వరకు, కోల్కతాలో రూ. 1,100 నుంచి రూ. 1,240 వరకు విక్రయిస్తున్నారు. చెన్నైలో మాత్రం ప్రభుత్వ నిబంధనల కారణంగా గరిష్ట ధర రూ. 508కే పరిమితమైంది. గ్రీక్ మైథాలజీ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!