

బిగ్బాస్ కొత్త సీజన్కు రంగం సిద్ధమైంది. ఈసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్బాస్ కొత్త సీజన్ల గ్రాండ్ లాంచ్లు ఒకేసారి జరగనున్నాయి. తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ హిందీ 20పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా, ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. మేరీ కోమ్ బిగ్బాస్లోకి వస్తే షోకు మరింత క్రేజ్ పెరగడంతో పాటు టీఆర్పీ కూడా పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
మేరీ కోమ్ 1983 మార్చి 1న మణిపూర్లోని పేద రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో పొలాల్లో పనిచేస్తూనే చదువుకున్నారు. 15 ఏళ్ల వయసులో ఇంటిని విడిచి బాక్సింగ్లో శిక్షణ పొందడం ప్రారంభించారు. 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మణిపూర్ బాక్సర్ డింకో సింగ్ స్ఫూర్తితో బాక్సర్ కావాలని నిర్ణయించుకున్నారు. ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆమె ప్రపంచ బాక్సింగ్లో అగ్రస్థానానికి ఎదిగి ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఆమె తల్లిదండ్రులతో పాటు భర్త ఓన్లర్ కోమ్ కూడా ఆమె కెరీర్లో కీలక పాత్ర పోషించారు.
2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి మేరీ కోమ్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా ఆమె గుర్తింపు పొందారు. క్రీడా రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులతో ఆమెను సత్కరించింది. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేశారు. 2005లో ఫుట్బాల్ క్రీడాకారుడు ఓన్లర్ కోమ్ను వివాహం చేసుకున్న మేరీ కోమ్కు నలుగురు పిల్లలు ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!