

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2027 సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్లో కీలక మార్పులు చేయాలని యోచిస్తోంది. సాధారణంగా మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే టోర్నీని మార్చి 10 ప్రాంతంలోనే ప్రారంభించి, మే 15 నాటికి ముగించే అవకాశాలను పరిశీలిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెలలో నమోదయ్యే తీవ్ర ఎండలు, ముందస్తు రుతుపవనాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 20వ సీజన్గా నిలిచే 2027 ఎడిషన్ను ఎలాంటి వాతావరణ అంతరాయాలు లేకుండా ఘనంగా నిర్వహించడమే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 74 మ్యాచ్లతో నిర్వహిస్తున్న టోర్నీని 94 మ్యాచ్లకు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఇప్పటికే బిజీగా ఉండటంతో మ్యాచ్ల సంఖ్య పెంపు సాధ్యం కాదన్నారు. అలాగే ఐపీఎల్ను ముందుగానే ప్రారంభించేందుకు దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ను పునర్వ్యవస్థీకరించే అవకాశాలను కూడా బోర్డు పరిశీలిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!