

అమెరికాకు చెందిన మెడికల్ కోడింగ్ సంస్థ కోరోహెల్త్ కేరళలోని కొచ్చి, కోజికోడ్ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో దాదాపు 900 మంది ఉద్యోగులు అనిశ్చితిలో పడిపోయారు. ఉదయం విధులకు వచ్చిన ఉద్యోగులను గేటు వద్దే నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయంలో ఉన్నవారిని బయటకు పంపించి, ఐడీ కార్డులు అప్పగించి రిలీవింగ్ లెటర్లు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు ఉద్యోగులు ఆరోపించారు. మూడు నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వాలని కంపెనీ ప్రకటించగా, కనీసం పది నెలల సెవరెన్స్ ప్యాకేజ్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
కేరళలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు చెబుతూనే హైదరాబాద్లో కొత్త నియామకాలు చేపడుతున్నారని ఉద్యోగులు ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఎమ్మెల్యే ఉమా థామస్, మంత్రి సన్నీ జోసెఫ్, కార్మిక శాఖ అధికారులతో కలిసి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులు యథావిధిగా విధులకు హాజరుకావచ్చని, జీతాలు మరియు ఇతర సౌకర్యాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే కేరళ కార్యకలాపాల భవిష్యత్తుపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!