

బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేవలం బంధువులను మెప్పించేందుకు రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పెళ్లిళ్లపై ఖర్చు చేయవద్దని ఆమె సూచించారు. ఆహారం, వెన్యూ, అలంకరణ, ఫొటోగ్రఫీ, వినోదం వంటి అంశాలపై భారీగా ఖర్చు చేసినప్పటికీ, ఆ వేడుకలు కొన్ని గంటలకే పరిమితమవుతాయని, కానీ వాటి ఆర్థిక ప్రభావం కుటుంబాలపై చాలా కాలం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఖర్చులో కొంత భాగమైనా సొంతింటి కొనుగోలుకు డౌన్ పేమెంట్గా, అత్యవసర నిధిగా, దీర్ఘకాలిక పెట్టుబడులుగా లేదా భవిష్యత్ పిల్లల విద్య కోసం వినియోగిస్తే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందని ఆమె సూచించారు. వివాహం జీవితంలో ఒక ముఖ్యమైన వేడుక అయినప్పటికీ, అది అప్పుల భారంగా మారకూడదని పేర్కొన్నారు. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఆచరణాత్మక సలహా అని అభినందిస్తుండగా, మరికొందరు జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక కావడంతో తమ ఇష్టానుసారం ఖర్చు చేయడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!