

సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ సజ్జనార్ హెచ్చరించారు. 2025 జనవరి నుంచి 2026 జులై 31 వరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పరిధిలో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన 403 కేసులు నమోదయ్యాయని, వీటిలో బాధితులు మొత్తం రూ.102.02 కోట్లు నష్టపోయారని తెలిపారు. ఇందులో ట్రేడింగ్ మోసాలు అత్యధికంగా ఉన్నాయి. 113 కేసుల్లో బాధితులు రూ.55.88 కోట్లు కోల్పోయారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా పార్ట్టైమ్ ఉద్యోగాలు, భారీ లాభాలు, పెట్టుబడి అవకాశాల పేరుతో సైబర్ నేరగాళ్లు వృద్ధులను ఆకర్షిస్తున్నారని సజ్జనార్ వివరించారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో 69 కేసులు నమోదవగా.. బాధితులు రూ.31.93 కోట్లు నష్టపోయారు. పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి కేసులు, అరెస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని సీపీ తెలిపారు. ఓటీపీ మోసాల్లో 115 కేసులు నమోదై రూ.4.94 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. పెట్టుబడి మోసాల్లో 22 కేసులకు సంబంధించి రూ.2.79 కోట్లు పోయాయని చెప్పారు. డేటింగ్ ఫ్రాడ్, హనీట్రాప్ ద్వారా 7 కేసుల్లో రూ.70.11 లక్షలకు పైగా కాజేశారని తెలిపారు. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల ద్వారా పరిచయాలు పెంచుకుని.. గిఫ్టులు, కస్టమ్స్ డ్యూటీ, అత్యవసర ఖర్చుల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, నగదు రికవరీకి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్ తెలిపారు. వృద్ధుల ఫోన్ వినియోగం, బ్యాంకింగ్ లావాదేవీలపై కుటుంబ సభ్యులు పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!