

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనను నిరసిస్తూ సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించి, ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలు, వ్యవసాయ సమస్యలు, రైతు భూములు, రైతు బీమా, మహిళలకు ఇచ్చిన హామీలు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై వివిధ రూపాల్లో నిరసనలు చేపడతామని వెల్లడించారు.
సెప్టెంబర్ 2న నియోజకవర్గాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ, ప్రదర్శనలు నిర్వహించనుండగా, 3న రైతు సదస్సులు, హైదరాబాద్లో ధర్నాలు చేపడతామని తెలిపారు. 4న మహిళలు, సామాజిక సంక్షేమ పథకాల అంశాలపై వంటావార్పు, 5న ఉద్యోగాలు, విద్యార్థుల సమస్యలపై ర్యాలీలు, సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాల్లో ప్రత్యేక నిరసనలు ఉంటాయని చెప్పారు. 6న తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాలపై ఆటో ర్యాలీలు నిర్వహిస్తామని, 7న ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై సామూహిక వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. చివరి రోజు జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామని నిరంజన్ రెడ్డి వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!