

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొలి రోజే హౌస్లో వాతావరణం వేడెక్కింది. కంటెస్టెంట్లు ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే అభిప్రాయ భేదాలు, మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మ్యాజికల్ కీస్ కోసం ఇద్దరిని ఎంపిక చేసే సమయంలో రోహిత్ నాయుడు, త్రిగుణ్ మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో రోహిత్ ఆట తీరును త్రిగుణ్ ప్రశ్నించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఎపిసోడ్లో హైలైట్గా నిలిచాయి.
మ్యాజికల్ కీస్ చుట్టూ సాగిన టాస్క్లో ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీస్ సాధించగా, మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో హౌస్లో పెద్ద చర్చ జరిగింది. త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లు సూచించగా, చివరకు అందరి అంగీకారంతో వారిద్దరికీ కూడా మ్యాజికల్ కీస్ లభించాయి. మరోవైపు బిగ్ బాస్ ఇచ్చిన వాటర్ టాస్క్లో రోహిత్ పాల్గొనలేదనే అంశాన్ని పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఈ విషయాన్ని త్రిగుణ్ పదేపదే లేవనెత్తడంతో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటి పనుల విభజన, కిచెన్, క్లీనింగ్ వంటి అంశాల్లోనూ కంటెస్టెంట్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మ్యాజికల్ కీస్ ద్వారా ఒక్కో కంటెస్టెంట్కు ప్రత్యేక పవర్స్ లభించడంతో గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. త్రిగుణ్కు ‘టేక్ ఓవర్’ పవర్ లభించింది. అంటే మరో కంటెస్టెంట్కు ఉన్న పవర్ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే పవర్, ముఖేష్కు మరో కంటెస్టెంట్ పవర్ను రివర్స్ చేసే అవకాశం దక్కాయి. వర్షిణికి ‘గ్రాబ్ ఎనీ విన్’, కృష్ణుడికి స్వాప్ పవర్, షాలినీకి డ్యూటీ అసైన్ చేసే పవర్, శ్రిష్టికి డైరెక్ట్ నామినేషన్ పవర్, రామ్ ప్రసాద్కు సేఫ్ షీల్డ్, నరేష్కు నామినేషన్లలో డబుల్ ఓట్స్ వేసే పవర్ లభించాయి. అయితే తమకు దక్కిన పవర్స్ను ఇతరులతో చర్చించవద్దని బిగ్ బాస్ హెచ్చరించారు.
ఇదే సమయంలో కంటెస్టెంట్లు ఇంకా హౌస్మేట్స్ కాలేదని, ఈ వారం హౌస్మేట్ హోదా సాధించడమే ప్రధాన లక్ష్యమని బిగ్ బాస్ స్పష్టం చేశారు. నామినేషన్లు లేకపోయినా ఎలిమినేషన్ మాత్రం ఉంటుందని హెచ్చరించారు. అనంతరం కంటెస్టెంట్లను రెండు జట్లుగా విడిపోయి, హై రిస్క్ నుంచి నో రిస్క్ స్థాయికి తీసుకెళ్లగల నాయకులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో ఝాన్సీ మినహా మిగిలిన వారు రోహిత్కు మద్దతు ఇవ్వగా, సెలబ్రిటీ కేటగిరీ కంటెస్టెంట్లు రామ్ ప్రసాద్, త్రిగుణ్లకు మద్దతు తెలిపారు.
టీమ్ లీడర్ ఎంపిక సమయంలో రోహిత్, త్రిగుణ్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అగ్నిపరీక్ష టీమ్ అంతా కలిసి రోహిత్కు ఓటు వేసిందని త్రిగుణ్ వ్యాఖ్యానించగా, షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడి వాదనను వ్యతిరేకించారు. రోహిత్ ఆటను గమనించిన తర్వాతే అతడిని నాయకుడిగా ఎంపిక చేశామని వారు స్పష్టం చేశారు. చివరకు బ్లూ టీమ్కు రామ్ ప్రసాద్, రెడ్ టీమ్కు రోహిత్ నాయకులుగా ఎంపికయ్యారు. దీంతో తొలి రోజే పవర్ గేమ్, వ్యూహాలు, విభేదాలతో బిగ్ బాస్ హౌస్లో హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!