

వ్యయ నియంత్రణలో భాగంగా మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థకు చెందిన గేమింగ్, విక్రయాలు, సలహా సేవల విభాగాల్లో ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,20,000 మంది ఉద్యోగుల్లో 2.5 శాతం కంటే తక్కువ మందిపై ఈ తాజా కోత ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది మే 2025లో 6,000 మంది, జులై 2025లో 9,000 మంది ఉద్యోగులను, అంటే మొత్తం సిబ్బందిలో 4 శాతం మందిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే ఈ ఉద్యోగాల కోతపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొంతమంది ప్రభావిత ఉద్యోగులకు సంస్థలోనే కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కృత్రిమ మేధ సాంకేతికతపై పెరుగుతున్న పెట్టుబడులు, వ్యయాలు సంస్థపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. గత నెలలో మైక్రోసాఫ్ట్ షేరు విలువ సుమారు 17 శాతం తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి దాదాపు 9,000 మంది అర్హత సాధించగా, వారిలో మూడింట ఒక వంతు మంది దాన్ని ఎంచుకున్నారు. అయితే విక్రయాలు, సలహా సేవల విభాగాల ఉద్యోగులకు ఈ పథకం వర్తించకపోవడంతో ఇప్పుడు ఆ విభాగాల్లోనే ఉద్యోగాల కోత జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!