

అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్ గత రెండు రోజుల్లో రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. అయితే ఈ రెండు దాడి ప్రయత్నాలను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకుందని, అనంతరం ప్రాంతీయ జలాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందని పేర్కొంది. ఈ ఘటనల్లో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ఇరాన్ దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా ఐదు చమురు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు సెంట్కామ్ వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)కు చెందిన చమురు అక్రమ రవాణా వ్యవస్థతో సంబంధం ఉన్నట్లు ఆరోపించిన ఎంటీ కావిజ్, ఎంటీ చార్మినార్, ఎంటీ హారైజన్-1, ఎంటీ రియెస్కో నౌకలను గల్ఫ్ ఆఫ్ ఒమన్లో, ఎంటీ దర్యా నౌకను ఇరాన్లోని ఖార్గ్ ద్వీపం సమీపంలో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
దాడులకు ముందు నౌకల్లోని సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా బలగాలు ఆదేశించాయని, ఆ తర్వాత నౌకలను పనిచేయకుండా చేశాయని సెంట్కామ్ పేర్కొంది. ఇరాన్ నుంచి భారీ స్థాయిలో చమురు అక్రమ రవాణా చేస్తూ, ఐఆర్జీసీతో పాటు దాని ప్రాంతీయ మద్దతుదారులకు నిధులు సమకూర్చే బహుళ బిలియన్ డాలర్ల ‘షాడో ఫ్లీట్’లో ఈ నౌకలు భాగమని అమెరికా ఆరోపించింది. సెప్టెంబర్ 5న కూడా మూడు ఇరాన్ చమురు నౌకలను అమెరికా ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు, తాజా అమెరికా దాడుల్లో రెండు చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జాస్క్, ఖార్గ్ ద్వీపం సమీపంలో ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది. నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు తెలిపింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. ఇరాన్ అమెరికా నేవీ నౌకలపై దాడికి ప్రయత్నిస్తే ప్రతిసారీ మరిన్ని చమురు ట్యాంకర్లను కోల్పోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!