

తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన మహా నిరాహార దీక్ష ముగిసింది. ప్రభుత్వం రూ.15 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ దీక్షకు విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, మేధావులు, పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభించిందని బీజేపీ తెలిపింది. వివిధ విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు దీక్షా శిబిరానికి తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యువమోర్చా సేకరించిన ఐదు లక్షల మంది విద్యార్థుల సంతకాల పత్రాలను పార్టీ నాయకత్వానికి అందజేశారు.
నిరంతర నిరాహార దీక్ష కారణంగా రాంచందర్ రావు ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు దీక్ష కొనసాగించడం ప్రమాదకరమని సూచించారు. పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వైద్యుల సలహాను గౌరవించిన ఆయన నిమ్మరసం స్వీకరించి దీక్షను విరమించారు. అనంతరం మాట్లాడుతూ, దీక్ష ముగిసినా విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం రూ.15 వేల కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!